ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మెగా ఆధార్ క్యాంప్‌కు ప్రజలు హాజరుకావాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మెగా ఆధార్ క్యాంప్‌కు ప్రజలు హాజరుకావాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం ఆధాబ్ న్యూస్;
జిల్లాలో రేపటి నుండి ప్రారంభమయ్యే మెగా ఆధార్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. జూలై 9, 10 తేదీల్లో కలెక్టర్ కార్యాలయంలో ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆధార్ కార్డుల్లో తప్పులు సవరించుకోవాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరమైన అవకాశం అని పేర్కొన్నారు. క్యాంప్‌లో పాల్గొనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు, ప్రజల సందేహాల నివృత్తి కోసం అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ క్యాంపులో అందుబాటులో ఉన్న సేవలు:

పేరు మార్పు / సవరణ

పుట్టిన తేది సవరణ

లింగం మార్పు

చిరునామా సవరణ

మొబైల్ నంబర్, ఫోటో, బయోమెట్రిక్ అప్డేట్లు

తల్లిదండ్రుల పేర్లు జతచేయడం

ఇవి కాకుండా 5 మరియు 15 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ వివరాల నవీకరణ తప్పనిసరి కాగా, 0-5 ఏళ్ల వయస్సు గల పిల్లల ఆధార్‌లో తల్లిదండ్రుల వివరాలను జతచేయడం కూడా ఈ క్యాంప్ ద్వారా చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో చేయగల సవరణలు, సేవా కేంద్రాల ద్వారా మాత్రమే చేయాల్సిన సవరణలు వేరువేరుగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఉదాహరణకు, చిరునామా మార్పు ఆన్‌లైన్‌లో సాధ్యపడుతుందంటే, మొబైల్ నంబర్, పుట్టిన తేది మార్పు వంటి సేవలు కేవలం ఆధార్ సేవా కేంద్రాల్లోనే చేయవలసి ఉంటుంది.

“రాష్ట్రస్థాయి బృందం కూడా ఈ క్యాంప్‌లో పాల్గొంటుండటంతో, కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది,” అని ఆయన తెలిపారు.

కావున, ఆధార్ డేటాలో సవరణలు చేయించుకోవాలనుకునే జిల్లావాసులు ఈ మేగా ఆధార్ క్యాంపులను తప్పక సందర్శించాలని, సంబంధిత పత్రాలు వెంట తీసుకురావాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!