స్నేహానికి నిలువెత్తు నిదర్శనం: బాల్యమిత్రుల మానవత్వం
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
స్నేహం అంటే కేవలం నవ్వులు పంచుకోవడమే కాదు… అవసరంలో అండగా నిలబడడమూ కావచ్చు. ఈ మాటను నిజం చేస్తూ కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో మరోసారి మానవత్వం వెల్లివిరిసింది.
గొల్లగూడెంకు చెందిన ఇర్ప నాగేంద్రబాబు తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న నాగేంద్రబాబు బాల్య మిత్రులు – కరకగూడెం (చిరుమల్ల) గిరిజన ఉన్నత పాఠశాల 2019-20 పదో తరగతి బ్యాచ్ స్నేహితులు – వెంటనే స్పందించారు.
తమ మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించి, రూ.10,000 ఆర్థిక సాయం అందజేయడం ద్వారా మానవత్వాన్ని చాటించారు. ‘‘చిన్న వయసులో తల్లిని కోల్పోవడం ఎంతో కష్టమైన విషయం. కానీ మేము మిత్రుడికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం,’’ అని వారు తెలిపారు.
ఈ దృశ్యానికి మరింత మానవతా పరిమళం జోడిస్తూ గ్రామ క్రీడాకారులు కూడా ముందుకొచ్చి రూ.3,500 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అవసరమైన సమయంలో ఇలా గ్రామం అంతా ఒక్కటిగా నిలవడం నిజంగా అభినందనీయమైంది.
ఇలాంటి సంఘటనలు నేటి సమాజంలో స్నేహితత్వ విలువను గుర్తు చేస్తూ, మానవత్వాన్ని నింపే ఆశాజ్యోతి గానే నిలుస్తాయి.









