రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు
మెదక్ జిల్లా లో ఘోర ఘటన
మెదక్, ఆధాబ్ న్యూస్:
హవేలీఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో మానవత్వాన్ని మరిచిపోయే దారుణం చోటు చేసుకుంది. రైతుబంధు పథకంలో వచ్చిన డబ్బుల కోసం తండ్రిని వివాదానికి లాగిన కొడుకు చివరికి నరమాంసం మీదకే దిగజారాడు.
ఔరంగాబాద్ తండాకు చెందిన బానోత్ కీర్యా అనే రైతుకు ఒక ఎకరం భూమి ఉండగా, ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రూ.6,000 జమ చేసింది. ఈ డబ్బుల్ని కావాలని ఆయన చిన్న కుమారుడు సంతోష్ కోరాడు.
అయితే తాను ఆరోగ్యం బాగా లేక రూ.2,000 ఖర్చు చేశానని, మిగిలిన రూ.4,000 ఇస్తానని కీర్యా స్పష్టంగా చెప్పాడు. ఈ మాటలు వినగానే సంతోష్ ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగసిపడి మొదట తండ్రిని కొట్టాడు. అనంతరం ఇంట్లో ఉన్న గొడ్డలితో తండ్రి నాలుక కోసేయడంతో, కీర్యా తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు.
గాయాలపాలైన కీర్యాను కుటుంబసభ్యులు వెంటనే మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. గ్రామంలో మాత్రం ఈ ఘటన కలకలం రేపింది.









