ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై చర్యలు తీసుకోండి: సామాజిక కార్యకర్త కర్నె రవి డిమాండ్

ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై చర్యలు తీసుకోండి: సామాజిక కార్యకర్త కర్నె రవి డిమాండ్

మణుగూరు, ఆధాబ్ న్యూస్:
ప్రైవేట్ పాఠశాలలు, బుక్ స్టాల్స్ కలసి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు, ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

శుక్రవారం మణుగూరులో తహసీల్దార్ అద్దంకి నరేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేసిన రవి, కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బుక్ స్టాల్స్ యజమానులతో కుమ్మక్కై బిల్లులు లేకుండా అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫార్ములు విక్రయిస్తున్నాయని తెలిపారు. ఒక్కో విద్యార్థి నుంచి తరగతిని బట్టి రూ.3000 నుంచి రూ.4000 వరకు పుస్తకాలకూ, రూ.5000 నుంచి రూ.6000 వరకు యూనిఫార్ములకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

“పేరులో మెడికల్ షాపు… అమ్మేది పాఠ్యపుస్తకాలు”

ఔషధ దుకాణాల లైసెన్స్ తీసుకుని, ఔషధాల సరఫరాతో పాటు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ విక్రయిస్తున్నదాన్ని కర్నె రవి తప్పుపట్టారు. “ఇది ఔషధ నియంత్రణ నిబంధనలకు విరుద్ధం. డ్రగ్ ఇన్స్పెక్టర్లు స్పందించి తనిఖీలు చేయాలి. ఈ విధంగా నిబంధనలు అతిక్రమిస్తున్న ఔషధ దుకాణాలపై చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

జీఎస్టీ బిల్లు ఇవ్వని దుకాణాలపై కమర్షియల్ శాఖ స్పందించాలి

పుస్తకాలు, యూనిఫార్ములు కొనుగోలు చేసిన తల్లిదండ్రులు బిల్ అడిగితే కేవలం కాగితపు చిట్టీ ఇచ్చి తప్పించుకుంటున్నారని, జీఎస్టీ బిల్లులివ్వకుండా వ్యాపారం చేస్తున్న దుకాణాలపై కమర్షియల్ టాక్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే కమర్షియల్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

అంతేకాక, ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై జిల్లా విద్యాశాఖాధికారి, ఆదాయపన్ను శాఖ అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బుక్ స్టాల్స్ యజమానుల ధన దాహాన్ని నియంత్రించేందుకు తహసీల్దార్ తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!