కవులూరు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు – 77 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా అభివృద్ధి వెలివేలా
కరకగూడెం, ఆధాబ్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిరు మల్ల గ్రామపంచాయతీ పరిధిలోని కవులూరు గ్రామ ప్రజలు రోడ్డు సౌకర్యం లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు టిడిపి నియోజకవర్గ నాయకులు చంద మధు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 77 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఈ గ్రామానికి పక్కా రహదారి కనబడడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా… గ్రామస్థుల కలలైన రహదారి వాస్తవంగా మారలేదు.
గత ప్రభుత్వంలో ఐటీడీఏ (సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో మెటల్ రోడ్డు వేసినప్పటికీ, అది కేవలం పాక్షికంగా మాత్రమే ప్రయోజనం కలిగిస్తోంది. గత రెండేళ్లుగా అదే మెటల్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు మట్టి చెరిపోతుండటంతో తూములు ఏర్పడి కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా మార్గ మధ్యలో ఉన్న కల్వర్టు ప్రాంతంలో మట్టి కుదిరిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.
విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రాథమిక అవసరాల కోసం ప్రజలు ప్రతినిత్యం కరకగూడెం రావాల్సిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కల్వర్టు నిర్మాణం జరిగితే గ్రామస్తుల సమస్యలు కొంతవరకు తీరుతాయనే నమ్మకం ఉంది.
ఈ సమస్యపై పినపాక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు చందా మధు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు బైరిశెట్టి వెంకన్న, గ్రామస్తులు సోలం వెంకటేశ్వర్లు, కొట్టెం రాము, సోలం కృష్ణ తదితరులు పాల్గొని సమర్పణ చేశారు. గ్రామానికి తగిన రహదారి, కల్వర్టు నిర్మాణం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.









