రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగే వేడుకలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా జరగాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వేడుకలలో భాగంగా ఉదయం 9:45 గంటలకు అమరవీరులకు నివాళులు, జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసుల గౌరవ వందనం జరుగుతాయని తెలిపారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాలు, అన్ని శాఖల అభివృద్ధి పనులపై ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
సాయంత్రం నాలుగు గంటలకు ఐదు నియోజకవర్గాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి సందేశాలతో కూడిన వేడుకలు జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు
రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలి
జూన్ 3 నుండి 20వ తేదీ వరకు గ్రామాల వారీగా జరగనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.
ప్రతి మండలంలో జరిగే సదస్సులకు రెండు రోజుల ముందుగానే గ్రామస్థులకు సమాచారం ఇవ్వాలని, అవసరమైన అప్లికేషన్ ఫారాలు, పత్రాలు ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సులు కొనసాగుతాయని తెలిపారు.
హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి, దరఖాస్తులను సక్రమంగా స్వీకరించాలని, ప్రతి అప్లికేషన్ను పూర్తిస్థాయిలో నింపి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
అప్లికేషన్ స్వీకరించిన వెంటనే దరఖాస్తుదారులకు రిసీవ్ కాపీ ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.









