వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కోడెల మరణాలు కలకలం
తిప్పాపూర్ గోశాలలో రెండు రోజుల్లో 14 కోడెలు మృతి – భక్తుల ఆందోళన
రాజన్న సిరిసిల్ల,ఆధాబ్ న్యూస్:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో రెండు రోజుల వ్యవధిలో 14 కోడెలు మృతిచెందాయి. నిన్న 8 కోడెలు మృతి చెందగా, నేడు మరో 6 కోడెలు మృతిచెందినట్టు తెలుస్తోంది. అనారోగ్యంతో బక్కచిక్కి దయనీయ స్థితిలో ఉన్న కోడెల దృశ్యాలు భక్తుల హృదయాలను కలచివేస్తున్నాయి.
వేములవాడ ఆలయంలో భక్తులు మొక్కులు తీర్చుకునే పద్ధతిలో కోడెను దేవుడి చుట్టూ తిప్పించే రీతిలో ఈ కోడెలు కీలక పాత్ర పోషిస్తాయి. గణనీయమైన ఆదాయం కోడె మూలంగానే ఆలయానికి వచ్చేస్తోంది. అయితే, గోశాలలో సామర్థ్యానికి మించి కోడెలను నిల్వ చేయడం వల్ల తరచూ తొక్కిసలాటలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇక కోడెలు మృతిచెందిన విషయాన్ని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేయడానికి యత్నించారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇదంతా దేవస్థాన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, కోడెల సంరక్షణపై దేవదాయ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ ఘటనపై భక్తుల మధ్య తీవ్ర అసంతృప్తి చెలరేగింది. కోడెల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు రూపొందించాలని, గోశాలలో తగిన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.









