ట్రాక్టర్ నాగళ్ళు కింద పడి చిన్నారి అక్కడికక్కడే మృతి
వ్యవసాయ పనుల ప్రారంభంలో చిన్నారులతో తస్మాత్ జాగ్రత్త
సిద్దిపేట, ఆధాబ్ న్యూస్:
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో జరిగిన విషాదకర ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. అల్వాల్ గ్రామానికి చెందిన బీర కనకయ్య కుమారుడు (వయసు 5 సంవత్సరాలు) ట్రాక్టర్ వెనుక భాగంలో అనుకోకుండా నాగళ్ళు కింద పడి దుర్మరణం చెందాడు.
వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటి వద్దే ఉండే ట్రాక్టర్ వెనుక చిన్నారి ఆడుకుంటుండగా, అప్రమత్తత లోపంతో ప్రమాదం చోటు చేసుకుంది. నాగళ్ళు కింద పడి బాలుడి మొఖం నుజ్జునుజ్జు అయ్యింది. కాలు పూర్తిగా తెగిపోయింది. ఈ దృశ్యం చూసిన తల్లిదండ్రులు తేరుకోలేక బోరున విలపిస్తున్నారు.
ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రైతు కుటుంబాల్లో వ్యవసాయ యంత్రాలతో పిల్లలు ఆడుకోవడం సాధారణమైన విషయమే అయినా, చిన్న అసావధానత చావుకు దారి తీస్తుందని ఈ ఘటన మరోసారి తేల్చిచెప్పింది.
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతోన్న ఈ సమయంలో, పిల్లల్ని ట్రాక్టర్లకు, యంత్రాలకు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.









