పైన టమాట ట్రేలు – కింద ఊపిరి ఆడకుండా పశువులు: ఏటూరునాగారంలో అక్రమ రవాణా డీసీఎం పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి హైదరాబాద్ దిశగా పశువులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని ఏటూరునాగారంలో పోలీసులు పట్టుకున్నారు. పైన టమాట ట్రేలు అమర్చి, దృష్టి మరల్చే ప్రయత్నం చేసినా… కింద భాగంలో ఊపిరి ఆడకుండా కట్టేసిన 17 పశువులను పోలీసులు గుర్తించారు.
పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ డీసీఎం వెలుగు చూసింది. పశువులను చట్టవిరుద్ధంగా తరలిస్తున్నట్టు భావించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, అక్రమ రవాణాకు ఉపయోగించిన డీసీఎంను సీజ్ చేసి, పశువులను సమీపంలోని గోశాలకు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మిగతా వివరాలను సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పశువుల రక్షణ కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.









