మానవత్వం చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్ మహేష్ – ప్రయాణికుడికి లక్ష రూపాయలు తిరిగి అప్పగింపు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: మానవత్వం ఇంకా జీవించి ఉందని నిరూపించిన సంఘటన మణుగూరు ఆర్టీసీ డిపోలో చోటు చేసుకుంది. మణుగూరు డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఇల్లటూరి మహేష్ మంచి మనసు చాటుకున్నారు. మంగళవారం డ్యూటీపై మణుగూరు నుండి అమలాపురం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో, బస్సులో ప్రయాణించిన అశ్వరావుపేటకు చెందిన ఓ ప్రయాణికుడు తన పర్సును బస్సులోనే మర్చిపోయాడు. ఆ పర్సులో లక్ష రూపాయల నగదు ఉండేది.
పర్సు మిస్ అయిన విషయం RTC అధికారులకు తెలియజేయడంతో, వెంటనే డ్రైవర్ మహేష్ తనిఖీ చేసి, బస్సులో పర్సును గుర్తించారు. అందులో లక్ష రూపాయల నగదు ఉన్న విషయాన్ని గమనించిన మహేష్, తన మనసున్న వ్యక్తిత్వాన్ని చూపిస్తూ పర్సును డిపో సెక్యూరిటీ అధికారులకు అప్పగించారు.
ఈ విషయం బుధవారం ఉదయం బాధితుడికి అధికారికంగా అప్పగించబడింది. డబ్బు సురక్షితంగా తిరిగి అందుకున్న ప్రయాణికుడు మహేష్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్టీసీ సిబ్బంది కూడా మహేష్ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇలాంటి సంఘటనలు ఆర్టీసీపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తాయని అధికారుల అభిప్రాయం. మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన డ్రైవర్ మహేష్పై ప్రశంసలు వర్షించుతున్నాయి.









