రాష్ట్రంలో వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపిన నేపథ్యంలో అన్ని శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ధాన్యం తడవకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యాన్ని తగిన రక్షణ చర్యలతో కాపాడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కాంటాలు వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు కలగకుండా చూడాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.









