ఒక్కసారి ఆలోచించండి..! సామాజిక మాధ్యమాలను బాధ్యతతో వాడుకుందాం
సామాజిక మాధ్యమాల వినియోగంపై న్యాయవాది కర్నె రవి సూచనలు
మణుగూరు, ఆధాబ్ న్యూస్: ఆధునిక యుగంలో కొన్ని క్షణాల్లోనే సమాచారాన్ని ప్రపంచానికి చేరవేసే సామాజిక మాధ్యమాలు ఎంతో శక్తివంతమైన వేదికగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి అన్నారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ—
“సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సమాచారాన్ని ప్రజలకు సత్వరంగా అందించడంలో సామాజిక మాధ్యమాలు ముందున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలను మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించాలి,” అని సూచించారు.
ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో సభ్యులు ఉన్న వాట్సాప్ గుంపుల్లో కొంతమంది వ్యక్తిగత కార్యక్రమాలైన వివాహాలు, గృహప్రవేశాలు, ఫంక్షన్లకు సంబంధించిన ఫోటోలను తరచుగా పలు గుంపుల్లో పంపడం వల్ల ఇతర సభ్యులకు అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.
“సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని స్పష్టంగా, నిజాయితీగా అందిస్తే అది మరెందరికో ఉపయోగపడుతుంది. ప్రజల సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసేలా సమాచారాన్ని పంచుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది,” అని చెప్పారు.
ఈ డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలు పారదర్శకతకు, త్వరిత స్పందనకు వేదికగా మారాయని ఆయన పేర్కొన్నారు.
“యువత అసలు అవసరం లేని విషయాలను పంచుకోవడం వల్ల తమ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే, ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి,” అని హెచ్చరించారు.









