భద్రాద్రి కొత్తగూడెంలో పోలీస్ స్టేషన్లలో ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి – ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ :భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూగర్భ జలాల పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ 2025 మే 15న విడుదల చేసిన ప్రకటనలో, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు మరియు పోలీస్ అధికారుల కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇంకుడు గుంతల ఏర్పాటుతో వర్షపు నీటిని భూగర్భంలోకి జరిపించి, భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించవచ్చని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకుందని, ప్రతి ఒక్కరు తమ నివాస ప్రాంతాల్లో కూడ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని, నీటి సంరక్షణలో భాగస్వాములవ్వాలని ఆయన సూచించారు.
పోలీస్ శాఖ ఈ ప్రక్రియకు ముందుండి ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో, జిల్లా స్థాయి నుండి మండల స్థాయికి అన్ని పోలీస్ కార్యాలయాల్లో ఇది అమలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు కూడా ఈ చర్యలను అనుసరిస్తూ, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని సూచించారు.









