నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి: సిపిఎం
కరకగూడెంలో ప్రజా ధర్నా నిర్వహించిన సిపిఎం – పోడు రైతులకు హక్కు పత్రాలు, మహిళలకు మహాలక్ష్మి పథకం, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రుణమాఫీ డిమాండ్
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మండల కార్యదర్శి కొమరం కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ, నిజమైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, మండలంలో మిగిలిపోయిన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, త్రీఫేస్ కరెంట్తో వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు ఉన్నవారికి పెన్షన్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2500, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ డిమాండ్లు నెరవేరకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని, అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల ముందు వంటావార్పు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
గత 40 ఏళ్లుగా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని, వాటి లేనితనంతో విద్యాభ్యాసం, భూహక్కులలో అవరోధాలు ఏర్పడుతున్నాయని అధికారులకు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో చర్ప సత్యం, కనితి రాము, పద్దం బాబురావు, శోభారాణి, లక్ష్మయ్య, పదం సత్యం, రమాదేవి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.









