కదలని బస్సు నెట్టిన ప్రయాణికులు – మధిర డిపో బస్సుల స్థితిపై విమర్శలు
ఎర్రుపాలెం, మే 9 ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర రోడ్డుబస్సుల పరిస్థితిపై ప్రయాణికులు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 6:30 సమయంలో మధిర డిపోకు చెందిన విజయవాడ గమ్యమైన టీఎస్ ఆర్టీసీ బస్సు (AP29Z2113) ఎర్రుపాలెంలో అకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులకెక్కువ ఇబ్బంది కలిగింది.
బస్సు స్టార్ట్ కాకపోవడంతో అందులో ఉన్న దాదాపు పది మంది ప్రయాణికులు దిగిపోయి స్వయంగా బస్సును వెనుకనుంచి నెట్టారు. కండక్టర్ సహా ప్రయాణికులు ప్రయత్నించిన తర్వాతే బస్సు కదిలింది.
ఇలాంటి సంఘటనలు మధిర డిపో బస్సుల నాణ్యతపై సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్నాయి. “ఉచిత బస్సు ప్రయాణ పథకాలు వున్నా, ప్రయాణం నెట్టుకుంటూ వెళ్లాల్సిన స్థితి వచ్చింది,” అంటూ ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
బస్సులన్నీ చాలా కాలం క్రితమే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినట్లు ప్రజలు వ్యాఖ్యానించారు. బస్సులను నెట్టే స్థితి రావడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ప్రజలు కొత్త బస్సులు ప్రవేశపెట్టి తమ ప్రయాణాన్ని సురక్షితంగా, నిరవధికంగా కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.









