అర్హులైన జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ
హైదరాబాద్, మే 9: ఆధాబ్ న్యూస్:
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ తెల్ల రేషన్ కార్డులను జారీ చేయడానికి తగిన చర్యలు త్వరితగతిన చేపడతామని నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ శుక్రవారం మంత్రిని కలిసి ఈ అంశంపై వినతి పత్రం అందజేశారు. జీవనోపాధి కోసం కృషి చేస్తున్న పత్రికా రంగ కార్మికులకు రేషన్ కార్డులు అత్యవసరమని, గతంలో డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.









