20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె – మణుగూరులో GMకు నోటీసు అందజేత
మణుగూరు, ఆధాబ్ న్యూస్: సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు ఎస్ఓ టు జీఎంకు దేశవ్యాప్తంగా ఈ నెల 20న జరగనున్న సార్వత్రిక సమ్మెకు సంబంధించి సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నేతలు ఆర్. మధుసూదన్ రెడ్డి, జి. శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాలు పాల్గొంటున్నట్లు తెలిపారు. మొత్తం పది డిమాండ్లతో ఈ సమ్మెను చేపడుతున్నామని, అందులో భాగంగా కనీస వేతనం రూ.26,000 చెల్లించాలనే డిమాండ్తో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని కోరుతున్నట్లు వివరించారు.
వారు పేర్కొంటూ, సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెరిగి ఇప్పటికే ఎనిమిదేళ్లయ్యిందని, మేడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేతనాల పెంపు ప్రకటన చేస్తారని కార్మికులు ఆశగా ఎదురు చూశారని, కానీ ప్రసంగంలో అటువంటి ప్రకటన లేకపోవడంతో తీవ్ర నిరాశలో మిగిలినట్లు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో వేతనాలు పెంచకపోవడంతో కాంగ్రెస్ హామీపై నమ్మకం ఉంచిన కార్మికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారని, కానీ ఇప్పుడు వేతనాలపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు వి. జానయ్య, ఎస్. సాంబశివరావు, ఎన్. నాగేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.









