ములుగు జెడ్పీ ఆఫీసులో ఏసీబీ దాడి: రూ.25,000 లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ సుధాకర్ అరెస్ట్
ములుగు, ఆధాబ్ న్యూస్: ములుగు జిల్లా జెడ్పీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీ అధికారులు మంగళవారం భారీ దాడులు చేశారు. సూపరింటెండెంట్ సుధాకర్ను రూ.25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సూచనలతో ముందస్తు ప్రణాళికతో కార్యాలయంపై దాడులు నిర్వహించిన అధికారులు, సుధాకర్తో పాటు జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. లంచం లావాదేవీకి ఆమె కూడా తోడ్పాటిచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లంచం తీసుకునే సమయంలో సుధాకర్, తోటి ఉద్యోగి ద్వారా డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ సిబ్బంది చొరబడడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం ఇద్దరినీ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అవినీతి లావాదేవీలపై మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనతో ములుగు జిల్లా అధికార వర్గాలలో కలకలం రేగింది.
ఇలాంటి సంఘటనలు ప్రజాసేవా రంగంపై ప్రజల్లో అవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి









