ఎస్సీ కులాల అభివృద్ధిపై ఆంక్షలు ఎత్తివేయాలి: తహసిల్దార్కు వినతిపత్రం సమర్పించిన పోరాట సమితి
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ పెనక సమ్మయ్యకు వినతిపత్రాన్ని అందజేసి, ప్రభుత్వాలు ఎస్సీ కులాల అభివృద్ధిపై విధించిన ఆంక్షలను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలు, భూమిలేని పేదలు, హక్కులేని పేదులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంత ఎస్టీలతో పాటు ఎస్సీలకు కూడా సమాన అభివృద్ధి కల్పించేలా ప్రభుత్వ పాలన ఉండాలని కోరారు.
ఎస్సీ రైతుల సాగు భూములు మరియు పోడు భూములపై ఆంక్షలు లేకుండా భూభారతి చట్టం ద్వారా హక్కు పత్రాలు అందించి, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణం లాంటి పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాడి లక్ష్మయ్య, పినపాక మాజీ ఎంపీటీసీ సోంపల్లి తిరుపతి, జిల్లా నాయకులు ఇనుముల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ జాడి కిరణ్, నరాల రాజేష్, బసారికారి లక్ష్మి, జాడి నాగలక్ష్మి, కొమరం సమ్మక్క, మైపా కాంతమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.









