పినపాక ఎమ్మెల్యే చేతుల మీదుగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.
బూర్గంపాడు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.1 కోటి 5 లక్షల 12 వేల 180 రూపాయల విలువైన చెక్కులు 105 మందికి పంపిణీ చేశారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా పేద కుటుంబాల్లో అమ్మాయిలకు ఆర్థిక సహాయం అందించేలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో సహాయపడుతున్నాయని అన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు
బూర్గంపాడు మండల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు సమకూర్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రుణమాఫీ, బియ్యం, ధాన్యానికి బోనస్ వంటి పథకాల ద్వారా ప్రజలకు మద్దతు అందిస్తున్నామని చెప్పారు.
ప్రజలకు సూచనలు – సమస్యలు పరిష్కార హామీ
వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని కోరారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, నాయకులు
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ADA తాతారావు, బూర్గంపాడు ఎమ్మార్వో ముజాహిద్, ఎంపీడీఓ జమలరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, మహిళా నాయకులు, యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.









