ఇంటర్, పదో తరగతి ఫెయిల్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలి: సామాజిక కార్యకర్త కర్నె రవి
మణుగూరు,ఆధాబ్ న్యూస్ : తెలంగాణలో ఇంటర్ మరియు పదో తరగతి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుభాకాంక్షలు తెలిపింది. అదే సమయంలో ఫెయిల్ అయిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని మణుగూరుకు చెందిన సామాజిక కార్యకర్త, లాయర్ కర్నె రవి పేర్కొన్నారు.
మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ఫెయిల్ అయిన విద్యార్థులకు నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మరియు పాఠశాలల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే వారికి కూడా సదుపాయం కల్పించాలని సూచించారు.
విద్యార్థులను వారి ప్రతిభ ఆధారంగా ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించి, ముఖ్యంగా సీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. తరచూ గైర్హాజరయ్యే విద్యార్థులను ఉపాధ్యాయులు “అడాప్ట్” చేసుకొని పరీక్షలకు హాజరయ్యేలా చేయాలన్నారు.
“పదవ తరగతి నుంచే జీవిత లక్ష్యం మొదలవుతుంది. భయం లేకుండా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలి. ఆటలూ, స్నేహితులూ అవసరమే కానీ చదువుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఆయన అన్నారు.
అలాగే, ప్రత్యేక తరగతులకు హాజరయ్యే దూరప్రాంత విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం అందించాలన్నారు.









