సింగరేణి స్కూల్ టాపర్ తేజశ్రీ – పగిడేరులోని చదువుల సరస్వతి
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా పరిధిలోని పగిడేరు గ్రామానికి చెందిన కర్నే తేజశ్రీ, చదువుల్లో తన ప్రతిభను చాటుతూ సింగరేణి సొసైటీ హై స్కూల్ టాపర్గా నిలిచింది. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో 600కి 552 మార్కులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
పివి కాలనీలోని సింగరేణి హై స్కూల్ విద్యార్థినిగా ఉన్న తేజశ్రీ, గతంలో 9.5 GPA సాధించిన కర్నే యోగితకు అనుబంధంగా, ఈ ఏడాది మెరుగైన ఫలితంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది.
తేజశ్రీ తండ్రి కర్నే ధర్మయ్య డిష్ సేవలు, వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని ఆదరిస్తుండగా, తల్లి భార్గవి టైలరింగ్ చేస్తూ కుటుంబ పోషణలో పాలుపంచుకుంటున్నారు. పిల్లల చదువుల పట్ల వారు చూపిన పట్టుదల ఫలితంగా తేజశ్రీ ఈ ఘనత సాధించింది.
ఈ సందర్భంగా తేజశ్రీ మాట్లాడుతూ –
“552 మార్కులు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా విజయానికి కారణమైన మా తల్లిదండ్రులకు, స్కూల్ కరస్పాండెంట్ గారికి, ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు. ఆగస్టు వరకూ టీచర్లు అందుబాటులో లేకపోయినా, వారు చెప్పిన బోధనల ద్వారా నేర్చుకొని ఈ ఫలితం సాధించగలిగాను. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది అనే విషయం నాకు పూర్తిగా నమ్మకం కలిగింది.”
తేజశ్రీ టాప్ ర్యాంక్ సాధించడాన్ని బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందిస్తూ, ఆమె మరింత ఉన్నత చదువులు చదివి జీవితంలో పైకెత్తాలని ఆశీర్వదిస్తున్నారు.









