ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య సహా ఐదుగురు అరెస్ట్

భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య సహా ఐదుగురు అరెస్ట్

కామారెడ్డి, ఆధాబ్ న్యూస్: భర్తను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చిన భార్య సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

మాచారెడ్డి మండలంలోని ఫరీద్ పేట గ్రామ శివారులో, డ్యూటీకి వెళ్తున్న ఘనపురం గ్రామానికి చెందిన సాడెం కుమార్‌పై ఈ నెల 21న ఇనుప రాడ్లతో దాడి జరిపి హత్యాయత్నం చేసినట్లు ఎస్పీ తెలిపారు. గాయపడిన కుమార్ మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేసి వేగంగా దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

దర్యాప్తులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని, విచారణలో నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఫిర్యాదుదారుడి భార్య సాడెం రేణుక కూడా ఉండగా, ఆమె వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త హత్యకు కుట్ర పన్నినట్టు వెల్లడయ్యింది.

ప్రధాన నిందితుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌కు చెందిన కాంపల్లి మహేష్ అని, ఆయన ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి సమీపంలోని లలితమ్మ దేవాలయంలో పూజారి గా పనిచేస్తున్నారని తెలిపారు. అక్కడే రేణుకతో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధం ఏర్పడినట్లు విచారణలో తేలింది.

కుమార్ హత్య అనంతరం అతని ఆస్తి చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో రూ.15 లక్షలకు సుపారీ ఇవ్వగా, అల్వాల్‌కు చెందిన మహమ్మద్ అశ్వాక్, ముబిన్, అమీర్, అన్వర్, మోసిన్‌లు ఈ కుట్రలో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. కుమార్ కార్యాలయానికి వెళ్లే మార్గాన్ని గుర్తించి, ఫరీద్ పేట సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద దాడికి ప్రణాళిక రచించినట్లు వివరించారు.

ఈ నెల 21న ఉదయం మహేష్, అశ్వాక్, అతని అనుచరులు కుమార్‌పై దాడి చేసి గాయపరిచారు. అదే సమయంలో అడ్డుగా వచ్చిన వ్యక్తులను చూసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి కారు, ఆటో, గొడ్డలి, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. మిగిలిన పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!