నిజామాబాద్,ఆధాబ్ న్యూస్:
నిజామాబాద్లో జరిగిన రైతు సదస్సు ఉత్కంఠభరితంగా మారింది. ఈ సదస్సులో పాల్గొనడానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వచ్చారు. సభా ప్రాంగణానికి కాస్త దూరంలో ప్రత్యేకంగా హెలిప్యాడ్ను ఏర్పాటు చేసినప్పటికీ, పైలట్ అనూహ్యంగా హెలికాప్టర్ను నేరుగా సభా వేదిక సమీపంలోనే దించారు.
దీంతో హెలికాప్టర్ రెక్కల గాలికి భారీగా దుమ్ము ఎగసిపడింది. సభా ప్రాంగణంలోని స్వాగత తోరణాలు నేలకొరిగాయి. దీంతో అక్కడున్న ప్రజలు భయభ్రాంతులై పరుగులు తీశారు. బందోబస్తుకు విధులు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే, పంట ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లు కూడా చెదరగొదరయ్యాయి. మంత్రులకు అపాయానికి తృటిలో తప్పించుకున్న పరిస్థితి నెలకొంది.
ఇదే తరహాలో, ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ ప్రయాణం కూడా ఉద్విగ్నకరంగా మారింది. భూభారతి చట్టం – 2025పై అవగాహన కల్పించేందుకు నాగర్కర్నూల్ జిల్లా వెళ్లిన మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్కుమార్ హెలికాప్టర్లో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ అవుతుండగా బుల్లెట్ ఫైర్ ద్వారా సంకేతం ఇవ్వగా, దాంతో అక్కడ గడ్డిపై మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ రెండు ఘటనలూ ప్రాణాపాయాన్ని తృటిలో తప్పించుకున్న ఉదంతాలుగా నిలిచాయి.









