బయ్యారం పోలీసుల హెచ్చరిక: పినపాక మండల ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎస్సై సురేష్
పినపాక, ఆధాబ్ న్యూస్:
గత 24 గంటలుగా పినపాక మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఏడూల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని పోలీసు అధికారులు తెలిపారు.
వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో గానీ, చెట్ల కింద గానీ ఉండరాదు, ఎందుకంటే పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ‘Damini’ అనే మొబైల్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని, పిడుగు ప్రమాదాల సమాచారం ముందుగానే తెలుసుకోవచ్చని తెలిపారు.
జాగ్రత్తలు పాటించాలి:
ఎలాంటి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
విద్యుత్ స్తంభాలు, తీగల దగ్గరికి వెళ్లరాదు.
కనీస నిత్యావసరాలు ఇంట్లోనే సిద్ధంగా ఉంచుకోవాలి.
నెలలు నిండిన గర్భిణీలు వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేలా చూసుకోవాలి.
ముంపు ప్రాంతాల ప్రజలు గోదావరి నీటి ప్రవాహాన్ని గమనిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
వరద పెరిగిన వేళ చేపలు పట్టేందుకు వెళ్లడం ప్రమాదకరం కావడంతో ప్రజలు దానిని నివారించాలన్నారు.
మండలంలో ఎక్కడైనా రోడ్లపై వరదనీరు ప్రవహిస్తున్నట్లయితే లేదా రాకపోకలు నిలిచినట్లయితే వెంటనే బయ్యారం పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.









