డబ్బు కోసం మైనర్ బాలుడి కిడ్నాప్: ముగ్గురు అరెస్ట్ – హన్మకొండ పోలీసుల స్పందన వేగవంతం
హన్మకొండ,ఆధాబ్ న్యూస్ : డబ్బు కోసం మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన ముఠాను హన్మకొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లికి అప్పగించారు.
అరెస్టు చేసినవారిలో పూరి పద్మ (45), ఆమె కుమారుడు పూరి రాజు అలియాస్ నరేష్ (25), జెట్టి జ్యోతి ఉన్నారు. శ్రీకాంత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి ఆటో, కత్తి, రెండు పెట్రోల్ బాటిళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హన్మకొండ ఏసీపీ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం – ప్రధాన నిందితురాలైన పూరి పద్మ బ్రాహ్మణవాడలో క్యాటరింగ్ నిర్వహించే రమణ వద్ద పని చేస్తూ ఆర్థిక వివాదంతో స్వగ్రామానికి వెళ్లింది. తనకు రమణ వద్ద నుంచి రావలసిన డబ్బులు తెచ్చుకునేందుకు అతని బంధువు అయిన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేయాలని ఆమె కుమారులు, జ్యోతితో కలిసి పథకం వేసింది.
జులై 4న బాలుడు ద్విచక్ర వాహనంపై బయటికి వచ్చిన సమయంలో నిందితులు అతన్ని నయీంనగర్ ప్రాంతంలో బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని అశ్వాపురం తీసుకెళ్లారు. అక్కడ బాలుడి తల్లికి ఫోన్ చేసి, 12 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరింపులు చేశారు. బాలుడిని మంగపేట, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో రహస్యంగా ఉంచారు. బెదిరింపుల్లో భాగంగా బాలుడిని కొట్టడం, పెట్రోల్ పోసి ముప్పిచ్చే ప్రయత్నం చేశారు.
ఈ రోజు ఉదయం నిందితులు రమణనూ కిడ్నాప్ చేయాలనే లక్ష్యంతో ములుగు రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో, యాదవనగర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆటోను అడ్డగించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ మాత్రం పరారయ్యాడు.
ఈ కేసును ఛేదించడంలో చొరవచూపిన ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్ఐ కిషోర్, AAO సల్మాన్ పాషా, కానిస్టేబుళ్లు అశోక్, కరుణాకర్, సతీష్, వినూష, కారుణ్య, HG రవి, యుగేందర్లను హన్మకొండ ACP అభినందించారు.









