గోదావరి ఉధృతి పరిశీలన: భద్రాచలం కరకట్ట వద్ద జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యటన
లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ సూచన
భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉధృతి గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం కరకట్ట వద్ద నదీ ప్రవాహ స్థితిని జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పరిశీలించారు.
ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడిన ఎస్పీ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన ప్రాథమిక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు పానిక్ చెందకుండా, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విపత్తు పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలతో పాటు ఉంటుందని తెలియజేసిన ఎస్పీ, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఇక వరదల నేపథ్యంలో భద్రాచలంలో ఐదు రెస్పాన్స్ బృందాలను (DDRF) పోలీస్ శాఖ తరఫున సిద్ధంగా ఉంచినట్టు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.









