రైతు భరోసా పథకం – వానాకాలం 2025-26
జిల్లాలో 1,13,398 మంది రైతులకు రూ.102 కోట్లు జమ
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
వానాకాలం పంట కాలానికి సంబంధించి రైతు భరోసా పథకం క్రింద లబ్ధి పొందిన రైతుల వివరాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, గత యాసంగి సీజన్లో జిల్లాలో 1,78,545 మంది పట్టాదారులు ఉన్నారు. ఈ వానాకాలంలో కొత్తగా 1,023 మందికి పట్టాలు జారీ చేయగా, గత సీజన్లో బ్యాంకు వివరాలు సరిగా లేని 832 మంది, అలాగే బ్యాంకు వివరాలు నమోదు చేయని 550 మంది రైతులు ఉన్నారు.
ఇప్పటివరకు 1,79,535 మంది లబ్ధిదారుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరించబడి, రైతు భరోసా పోర్టల్లో నమోదు చేశారు.
16-06-2025 వరకు 1,48,823 మందికి రూ.186.38 కోట్లు ట్రెజరీకి పంపగా, అందులో 83,271 మంది రైతుల ఖాతాల్లో రూ.56.69 కోట్లు నేరుగా జమ అయ్యాయి.
ఈ రోజు (17-06-2025) మరో 30,127 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.45.41 కోట్లు నేరుగా జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ మేరకు మొత్తంగా 1,13,398 మంది లబ్ధిదారులకు రూ.102.10 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.
కలెక్టర్ సూచించినట్లు, నూతనంగా పట్టాలు పొందిన రైతులు తమ పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నకలును సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు సమర్పించి రైతు భరోసా పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకం ద్వారా మేలు కలుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.









