తండ్రి హృదయవేదన నుంచి జనసేవగా మారిన షూ పంపిణీ కార్యక్రమం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
ఆలేరు,ఆధాబ్ న్యూస్:
ఆలేరు నియోజకవర్గంలో నిర్వహించిన షూ పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్ద కూతురు వికలాంగురాలని, ఆమెకు షూ వేసుకునే అదృష్టం లేదని చెబుతూ, “మీరు షూలు వేసుకుని నడిచే ప్రతి అడుగులో నాకు నా కూతురే కనిపిస్తుంది” అంటూ కంటతడి పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ పథకం కాదు, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే ఇచ్చిన దానం కూడా కాదన్నారు. ఒక తండ్రి గుండె నుంచి వచ్చిన బాధనే ఆధారంగా చేసుకుని, తన స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించానని తెలిపారు. తన బిడ్డలో చూసిన వేదనను వందలాది పిల్లల చిరునవ్వులుగా మార్చాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం చేశానన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పిల్లల పాదాలపై షూలు వేస్తున్న ప్రతి క్షణం తన కూతురు జ్ఞాపకం కళ్ల ముందు నిలిచిందని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, స్థానికులు ఈ సేవాభావాన్ని ప్రశంసించారు.
రాజకీయాల్లో పదవులు చాలామందికి ఉన్నా, బాధను బలంగా మార్చి సేవనే రాజకీయంగా చేసుకున్న ఇలాంటి నాయకులు అరుదని పలువురు అభిప్రాయపడ్డారు. బీసీ బిడ్డల మనసుల్లో నిలిచే ప్రజా నాయకుడిగా తీన్మార్ మల్లన్న తనదైన ముద్ర వేసుకున్నారని స్థానికులు పేర్కొన్నారు.







